IPL టెలికాస్ట్లో సుత్తి ప్రకటనలు.
21/04/2012
ఈ నెల మొదటివారంలో IPL అయిదో సీజన్ మొదలయ్యింది. ఇప్పటి వరకు మ్యాచులన్నీ ఆసక్తికరంగానే ఉన్నాయి కాని, టెలీకాస్ట్ మధ్యలో వచ్చే ప్రకటనలే చాలా బోరు కొడుతున్నాయి. అంతంత డబ్బులు ఖర్చుపెట్టి అలాంటి చెత్త యాడ్లు ఎలా ప్రసారం చేస్తున్నారో అర్థం కాదు.
ముఖ్యంగా వొడాఫోన్ ప్రకటనలు చూడండి. ఇదివరకటి IPL సీజన్లలో వొడాఫోన్ వాళ్ళ జుజు ల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూసేవారు. జుజుల చిన్న చిన్న హాస్య సన్నివేశాలు ఎంతో సరదాగా ఉండేవి. ఇప్పుడు ఏవో కొన్ని పురాతన దృశ్యాలు లాంటివి తీసుకొచ్చి ప్రకటనలు అని చూపిస్తున్నారు.
అలాగే ఐడియా వాళ్ళ ప్రకటనలు కూడా చాలా చిరాగ్గా ఉన్నాయి. ఈ అర్థం పర్థం లేని స్వర్గలోక సన్నివేశాలని చేయడానికి అభిషేక్ బచ్చన్ ఎలా ఒప్పుకున్నాడో? ఇది నిజంగా స్టుపిడ్ ఐడియా అని చెప్పాలి.
ఇంకోటి టాటా డొకోమో వాళ్ళ రెస్టారెంట్ యాడ్లు. యువకుడైన రణబీర్ కపూర్ని ముసలివాడిగా మార్చేసి సిల్లీగా ఉండే ప్రకటనలు రూపొందించారు. కస్టమర్లు మరీ అంత అమాయకంగా ఉంటారా ఎక్కడైనా?
మరొకటి కాడ్బరీస్ 5 స్టార్ చాకొలెట్ల దర్జీ ప్రహసనం. ఇది కూడా అతిగా ఉంది.
ఇలాంటి చెత్త ప్రకటనల వల్ల వాళ్ళ ప్రొడక్టులకి మేలు జరగకపోగా, నెగటివ్ రిజల్ట్ కూడా రావచ్చు. ఇలాంటి చెత్త యాడ్ల మధ్యలో మన తెలుగు సూపర్స్టార్ మహేష్ బాబు థమ్స్ అప్ యాడ్ చూడడం కాస్త రిలీఫ్. “ఆజ్ కుచ్ తూఫాన్ కర్తే హై” అంటూ మహేష్ అదరగొట్టాడు. ఇన్నాళ్ళకి ఒక తెలుగు హీరో నేషనల్ మీడియాలో, ప్రైం టైములో కనపడడం గొప్ప విషయమే. బెస్ట్ ఆఫ్ లక్ మహేష్..
కోటిపల్లి రేవు
14/04/2012
గత వారం స్వాతి వార పత్రికలో వంశీ కొత్త సీరియల్ ‘రంగులరాట్నం’ ప్రారంభమయింది. నగరాల్లో పెరిగిన కొంతమందికి వంశీ రచనలు అంతగా నచ్చకపోవచ్చు కాని, మా గోదారోళ్ళకి మాత్రం వంశీ ఏమి వ్రాసినా ఆసక్తికరంగానే ఉంటుంది. ఆ సీరియల్ కోటిపల్లి రేవు దగ్గర మొదలవుతుంది. ఇది చదువుతున్నప్పుడు గత సంవత్సరం నేను నా స్నేహితులతో కలిసి కోటిపల్లి రేవుకి వెళ్ళిన సంగతులు గుర్తుకొచ్చాయి.
నా చిన్నప్పుడు ప్రతీ ఏడాది, అంతర్వేది తీర్థానికి వెళ్ళేవాళ్ళం. కాని తరువాత ఉద్యోగరీత్యా, చాలా ఏళ్ళు వెళ్ళటం కుదరలేదు. క్రిందటి సంవత్సరం ఎలాగైనా వెళ్ళాలని నా ఇంటర్ నాటి స్నేహితులతో ప్లాన్ చేసుకుని నలుగురు స్నేహితులం అంతర్వేది తీర్థానికి వెళ్ళాము. మర్నాడు కోనసీమ చూద్దామని నరసాపురం నుంచి బయలుదేరాము. చించినాడ వద్ద వశిష్ట బ్రిడ్జి, గన్నవరం వద్ద డొక్కా సీతమ్మ అక్విడెక్టు చూసుకుని అంబాజీపేట సెంటరు దగ్గర ఆగాము. అక్కడ ఒక హోటల్లో కోనసీమ స్పెషల్ పొట్టక్కలు కడుపునిండా తిని ముక్తేశ్వరం చేరుకున్నాం.
సీరియల్లో ముక్తేశ్వరం దగ్గర పడవ మీద రేవు దాటి లంకలో నడిచి వెళితే అవతలి వైపు రేవు వస్తుందని వ్రాసాడు. కాని మేము వెళ్ళినప్పుడు లంకలోకి కూడా కారులోనే వెళ్ళిపోయాము. నదిలో నీరు తక్కువ ఉండటం వలన, నదిలోనే కచ్చా రోడ్డు వేసారు. లంకకి అటువైపు చేరుకుని, కోటిపల్లి రేవుకి టిక్కట్టు తీసుకుని పడవకోసం వెయిట్ చేసాము.
కొంతసేపటికి ఒక ఇంజను బోటు నిండా ప్రయాణికులతో అటువైపునుండి వచ్చింది. వాళ్ళందరూ దిగాకా, ముందుగా మోటార్ సైకిళ్ళని ఎక్కించడం మొదలుపెట్టాడు పడవ వాడు. వాళ్ళకి మనుషులకంటే మోటార్ సైకిళ్ళే ముఖ్యం అన్నట్టుగా ఉంది. మామూలు సైకిళ్ళ కంటే, మోటారు సైకిళ్ళూ ఎక్కువ ఉండడం కొత్తగా అనిపించింది. సైకిళ్ళన్నీ ఎక్కాకా, జనం పడవ ఎక్కారు. కొంతమంది జనం ఎలాగో సర్దుకు కూర్చున్నారు. కొంతమంది నిలబడే ప్రయాణించారు. వచ్చినవాళ్ళందరినీ ఎక్కిస్తూనే ఉంటే, ఈ బోటు కెపాసిటీ ఎంత అని పడవ వాడిని అడిగాము. అతను అలాంటివేమీ తనకి తెలియదని అన్నాడు. మాకైతే భయం వేసింది, క్షేమంగా అవతలి ఒడ్డుకి చేరతామా, లేదా అని. పడవలో లైఫ్ జాకెట్లు కూడా ఏమీ లేవు. అప్పుడు అర్థమయ్యింది ప్రతీ ఏడాదీ, మన దేశంలో పడవప్రమాదాల్లో అంతమంది ఎందుకు చనిపోతున్నారో. హుస్సేన్ సాగర్ లాంటి చోట్ల పర్యాటకులకి లైఫ్ జాకెట్లు తప్పనిసరి చేసిన ప్రభుత్వం ఇలాంటి చోట్ల ఏ విధమైన రక్షణ చర్యలు ఎందుకు తీసుకోదు? ఫ్రమాదం జరిగాక నాయకులు తీరిగ్గా వచ్చి మొసలి కన్నీళ్ళు కారుస్తారు.
ఎలాగైతేనేమి, కోటిపల్లి రేవుకి చేరుకుని సోమేశ్వరుడిని దర్శించుకుని, మళ్ళీ అలాంటి బోటుమీదే క్షేమంగా ముక్తేశ్వరం వైపుకి తిరిగి వచ్చాము. అక్కడినుండి ముక్తేశ్వరం, అయినవిల్లి దేవాలయాలు దర్శించుకుని, రావులపాలెం చేరుకున్నాం. చీకటిపడే వేళకి లొల్ల లాకులు చూసి, తరువాత ఆత్రేయపురంలో పూతరేకులు కొనుక్కుని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. అదండీ మా ఒక రోజు కోనసీమ యాత్ర. ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి మిగతా ప్రదేశాలు కవర్ చెయ్యాలి.
జెంటిల్ మేన్ ఆఫ్ క్రికెట్.
10/03/2012
సచిన్, గంగూలీ, లక్ష్మణ్ స్టైల్గా కొడతారు.
సేహ్వాగ్, ధోనీ బలంగా కొడతారు.
కాని ద్రవిడ్ మాత్రం శ్రద్ధగా కొడతాడు.
‘అతడు’ సినిమాలో తనికెళ్ళ భరణి చెప్పినట్టు శ్రద్ధగా, పధ్ధతిగా, జాగ్రత్తగా, గోడ కట్టినట్టు బాటింగ్ చెయ్యడం ఒక్క ద్రవిడ్కే సాధ్యం.
పద్మశ్రీ రాహుల్ శరద్ ద్రవిడ్
ద్రవిడ్కి ముందు వెంగ్సర్కార్ని ఇలాగే ‘మిస్టర్ డిపెండబుల్’ అనేవారు.
రాహుల్ ద్రవిడ్ అంతకన్నా గొప్పగా ‘ది వాల్’ అనిపించుకున్నాడు.
ద్రవిడ్ బాటింగ్లో అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఎవరో ఒకరితో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించడం. భారత జట్టు విజయాలకి ఈ భాగస్వామ్యాలే ఎంతో ఉపయోగపడ్డాయి. ఒకోసారి ఈ భాగస్వామ్యాలలో ద్రవిడ్కి పేరు రాకపోవచ్చు, కాని ఒకవైపు ద్రవిడ్ భరోసా లేకపోతే అవతలి బాట్స్మెన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడలేడు.
ద్రవిడ్ టెస్టుల్లో చేసిన 36 సెంచరీలలో భారత జట్టు ఓడిపోయింది కేవలం 4 టెస్టుల్లోనే. ఆ నాలుగింటిలో కూడా మూడు గత ఏడాది ఇంగ్లండ్ సిరీస్లో చేసినవే. ఆ సిరీస్లో మిగిలిన భారత ఆటగాళ్ళు ఎంత చెత్తగా ఆడారో మనకు తెలుసు. ఈ ఒక్క లెక్క చాలు ద్రవిడ్ భారత జట్టుకి ఎంత నిస్వార్థంగా సేవచేసాడో చెప్పడానికి.
జట్టుకి అవసరమైనప్పుడు వికెట్ కీపర్గా, ఓపెనర్గా, ఏ స్థానంలోనైనా, ఈగోలు లేకుండా ఆడడం ద్రవిడ్ లాంటి జెంటిల్ మేన్ మాత్రమే చేయగలడు. తనకు నచ్చని పరిస్థితుల్లో ఎవరూ అడగకుండానే, కెప్టెన్సీకి రాజీనామా చెయ్యడం కూడా ద్రవిడ్కే సొంతం. ఇప్పుడు కూడా సీనియర్లు ఆటకి గుడ్బై చెప్పాలని అందరూ విమర్శిస్తుంటే, ఒక ద్రవిడ్ మాత్రమే హుందాగా తప్పుకుంటున్నాడు.
ద్రవిడ్ని యువ క్రికెటర్లు ఆదర్శంగా తీసుకుని భారత జట్టుకి సేవలు అందించాలని కోరుకుందాం.
హాట్సాఫ్ ద్రవిడ్.







