కలలని లిఖించిన “కలాం”
28/07/2015
జీవితంలో కలలు కంటూ, వాటిని నిజం చేసుకోవడానికి అనుక్షణం ప్రయత్నించమని యువతకు సందేశమిచ్చిన అబ్దుల్ కలాం గారి మరణం మన దేశానికి తీరని లోటు. కాని ఆయన కలం ఇప్పటికే మనకు ఇచ్చిన అనేక పుస్తకాలు, ఆయన చేసిన ప్రసంగాలు మనకు ఎన్నో సందేశాలు ఇస్తాయి. ఆయన కేవలం ఒక మాజీ రాష్ట్రపతి మాత్రమే కాదు, ఒక శాస్త్రవేత్త, దార్శనికుడు, నాయకుడు, మహర్షి, మానవతావాది.
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ ప్రజలని, ముఖ్యంగా యువతని ఇంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. మరణించే చివరి క్షణం వరకు, ఆయన తనకెంతో ఇష్టమైన విద్యార్థులతో గడుపుతూ, వాళ్ళని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. కలలని నిజం చేసుకోవడం సాధ్యమే అన్న అద్భుతమైన నమ్మకాన్ని ఈ దేశ యువతకి అబ్దుల్ కలాం మాత్రమే కలిగించారు.
ప్రపంచంలో చాలామంది మేధావులు, గొప్పవాళ్ళు ఉంటారు. కాని కొద్దిమంది మాత్రమే సామాన్యులతో మమేకం కాగలరు. ఎందుకంటే కలాం లాంటి వాళ్ళు పుట్టుకతో సామాన్యులు కాబట్టి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా మూలాలని మరిచిపోరు. తనలాంటి సామాన్యులు అందరూ గొప్పవాళ్ళు కావాలని పరితపిస్తుంటారు.
రాష్ట్రపతి అంటే రబ్బర్ స్టాంప్ కానక్కరలేదు, తన దార్శనికతతో ప్రజల హృదయాల మీద శాశ్వత ముద్ర వేయవచ్చని నిరూపించిన ప్రజల రాష్ట్రపతి ఆయన. కలాం గారు రాష్ట్రపతి అవటానికి కారణమైన మరో దార్శనికుడు, అప్పటి NDA నాయకుడు, వాజ్పేయి గారికి ఈ దేశం ఎల్లప్పుడూ ఋణపడి ఉంటుంది. రెండోసారి రాష్ట్రపతిగా పని చేసే అవకాశం ఆయనకు UPA ప్రభుత్వం ఇవ్వనప్పుడు, ఆయన ఎందుకు మళ్ళీ రాష్ట్రపతి కావడంలేదని స్కూలు పిల్లలు కూడ ప్రశ్నించారంటే, కలాం ఈ దేశప్రజల మనసుల్లో ఎంతగా నిలిచిపోయారో అర్థమవుతుంది.
ముస్లింగా పుట్టి తన మతాన్ని పాటిస్తూనే, అన్ని మతాలనూ గౌరవిస్తూ జీవించిన నిజమైన భారతీయుడు కలాం సాబ్. రాష్ట్రపతిగా పార్లమెంటులో తన తొలి ప్రసంగాన్ని “ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు” అంటూ త్యాగరాజ కీర్తనతో ప్రారంభించిన నిజమైన లౌకికవాది అబ్దుల్ కలాం.
కలాం వ్రాసిన INDIA 2020 పుస్తకంలోని ఆయన విజన్ వచ్చే అయిదేళ్ళలో నిజం అయ్యే అవకాశం కనపడటంలేదు. కనీసం 2030 నాటికైనా మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా, knowledge super power గా ఎదిగి, ఆయన కల నిజం అవుతుందని ఆశిద్దాం.
కలాం నమస్తే.
No comments yet