ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు.
23/08/2020
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలని 25 జిల్లాలకు పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిని ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి పరిధి వలన ప్రజల సామాజిక అవసరాలు తీరడంలో ఇబ్బందులు వస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గాలకి, స్థానిక పరిపాలనకి పెద్దగా సంబంధం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో తమకుండే పనులకి ప్రజలు తరచుగా జిల్లా ముఖ్యపట్టణం వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల ముఖ్య పట్టణాలు జిల్లాకి మధ్యలో లేవు. స్థానిక పరిపాలన అంతా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రాతిపదికన నడుస్తోంది కాబట్టి, కొత్త జిల్లాలు కూడ వీటి ప్రాతిపదికనే ఏర్పాటు చెయ్యడం ప్రభుత్వానికి, ప్రజలకీ సౌకర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పరిధి మారవచ్చు, కొన్ని నియోజకవర్గాలు ఉండకపోవచ్చు. అంతే కాకుండా ఒకో జిల్లాకి, ఒకో MP సామంత రాజుగా వ్యవహరించే ప్రమాదం కూడ ఉంది.
రాష్ట్రంలో 50 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కాబట్టి జనాభా, వైశాల్యం లాంటి వివరాల ఆధారంగా, రెండు లేదా మూడు డివిజన్లతో ఒకో జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. విశాఖపట్నం, విజయవాడ లాంటి ముఖ్య నగరాలని ఒకో డివిజనుతో ఏర్పాటు చెయ్యవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి అవడానికి, భూ సేకరణకి, తరువాత నిర్వహణకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చెయ్యాలి. అలాగే ప్రకృతి అందాల కోనసీమని పర్యాటకంగా అభివృద్ధి చెయ్యడానికి అమలాపురం డివిజనుని కోనసీమ జిల్లా చెయ్యాలి. నాకు ఉన్న విషయ వనరులు, ఆలోచనలని బట్టి ఈ క్రింది విధంగా జిల్లాలు పునర్విభజించవచ్చని అనుకుంటున్నాను. ప్రభుత్వం తన అవసరాలకి అనుగుణంగా కావలసిన మార్పులు, చేర్పులు ఎలాగూ చేసుకోవచ్చు.
6 వ్యాఖ్యలు
leave one →
న్యాయంగా ప్రజల అభిప్రాయాలకు విలువ ఉండాలి. రాజకీయ నాయకులూ, పార్టీల అభిప్రాయాల కన్నా ఎక్కువ విలువ ఉండాలి. కాని ఒకసారి ఎన్నుకున్నాక, తమను ప్రశ్నించే అధికారం ప్రజలకు లేదన్నట్లు వ్యవహరించే రాజకీయ నాయకులూ, రాజకీయపార్టీలు అలా ప్రజాభిప్రాయానికి ఆట్టే విలువను ఇవ్వవని అందరమూ చూస్తున్న సంగతే. John Dalberg మా ఒకటుంది Power tends to corrupt, and absolute power corrupts absolutely అని. మన ప్రజలు ఏదైనా రాజకీయ పార్టీకి అత్యధికమైన మెజారిటీ ఇచ్చి అధికారం అప్పగించాక, నిస్సహాయంగా చూడటం తప్ప చేసేది ఆట్టే లేదు నేటీ కాలంలో. మళ్ళా ఎలక్షనులు వస్తే అప్పడు ఏదన్నా చెయ్యగలరేమో కాని అందాకా ఏమీ చేయలేరు. ప్రస్తుతం మీరు, మీలాంటీ మరికొందరు సూచనలు చేయటం వలన అధికారంలో ఉన్న ప్రభుత్వం వాటిని పరిగణనలోనికి తీసుకుంటుందని భావించలేం. అధికారపార్టీలకు ఎప్పుడూ వాటి ఆలోచనలూ ప్రణాళికలూ అవసరాలూ వాటికి వేరే ఉండవచ్చు. ఊరికే సలహాలిచ్చి అప్పుడప్పుడు కొందరు ప్రభుత్వదృష్టిలో రాజద్రోహులు కావటం కన్న ఈరోజుల్లో జరిగేది ఏమీ లేదు.
మీ ప్రతిపాదన బాగుంది. ప్రభుత్వానికి పంపండి. సరైన అధికారులకు చేరితే తప్పక పరిశీలిస్తారు.
ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టిన ప్రతిపని ని నకారాత్మక నిరాశాపూరిత దృష్టితో కొంతమంది చూస్తున్నారు. అది సరి అయిన విధానం కాదు. మంచి చెడూ రెంటినీ చూసి స్పందించే సమ దృష్టి అవసరం.
శ్యామలరావు గారు, బుచికి గారు, మీ స్పందనకు కృతజ్ఞతలు.
ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బలంగా ఉండదు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. ఏదో నా ఆలోచనలని ఇలా బ్లాగు మిత్రులతో పంచుకోవాలని, బ్లాగులో పదిలపరచుకోవాలన్న భావన తప్ప వేరే ఏమీ లేదు. గత ప్రభుత్వాల హయాములో కొన్ని E mails పంపించినా ఎటువంటి స్పందనా లేదు. ఇప్పుడు ఎవరికీ పంపించే ఆలోచన లేదు.
బోనగిరి గారూ, ప్రతిపాదిత పోలవరం జిల్లా వలన రంపచోడవరం, ఎటపాక & జంగారెడ్డిగూడెం *ప్రజలకు* చేకూరే ప్రయోజనం ఏమిటో అర్ధం కాలేదు. కోయల సమస్యలు & వాటి పరిష్కారాలు భౌగోళికధారాలు కావు.
ఇది విమర్శ కాదు, దృక్కోణం సమస్య.
జై గారు, ప్రాజెక్టు నిర్మాణం త్వరగా జరగడానికి సానుకూలంగా ఉంటుందని అంచనా. అంతే. ం
ప్రాజెక్ట్ నీళ్లతో వేరే ఎవరికో ఉపయోగమా కాదా అన్నది పక్కనపెడితే ఆయా రెవెన్యూ డివిజన్లలో ఒక సెంటు భూమికి సైతం ఒక్కటంటే ఒక సేద్యపు నీటి చుక్క కేటాయింపు లేదు, వచ్చే అవకాశం ఏకోశానా లేదు.
ఇప్పుడికే మూడు పంటలు పండించుకుంటూ జల్సా జీవితంలో ధన్యులవుతున్న డెల్టా బడా భూస్వాములు మా అలగా బోంట్ల సాయం పుణ్యమా అంటూ ఇంకా విలాసవంతంగా మేడలు కట్టుకుంటారన్న “మానసిక తృప్తి” తప్పవిడిచి ఒరిగేది హుళక్కి. జల్, జంగల్, జమీన్ (కోయ భాషలో వీటిని ఏమంటారో తెలువదు) అన్నీ గాయబ్, బడా భూస్వామ్యులు దయ తలిస్తే ఎదో కుక్క బిస్కత్తులు పారేస్తాడని ఆశతో ఊడిగం చేయడమే కోయలకు మిగిలిన “అభివృద్ధి”