రాజకీయాల్లోకి మెట్రో మ్యాన్ శ్రీధరన్
ఇ. శ్రీధరన్, ఈ పేరు తెలియని సివిల్ ఇంజనీర్ బహుశా ఇండియాలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థని ఆధునీకరించిన ఘనత ఆయనకే దక్కుతుంది. దేశంలోని చాలామంది సివిల్ ఇంజనీర్లకు ఈయన ఆదర్శం. అర్థర్ కాటన్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె. ఎల్. రావు లాంటి మహామహుల తరువాత మన దేశంలో అంత ప్రఖ్యాతమయిన సివిల్ ఇంజనీర్ శ్రీధరన్ గారే అని చెప్పవచ్చు. నేను దిల్లీలో పని చేస్తున్నప్పుడు ఒకసారి ఆయనని కలిసే అవకాశం వచ్చింది. మా కంపెనీ ఎం. డి. తో కలిసి శ్రీధరన్ గారిని ఆయన చాంబర్లో కలిసాను.

88 ఏళ్ళ వయసు దాటిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ ఇటీవల రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రస్తుతం కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఆయన బిజెపి తరపున పాలక్కాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో బిజెపికి అధికారం వస్తే ముఖ్యమంత్రి అవడానికి కూడ ఆయన ఆసక్తి చూపించారు. ఇలాంటి ప్రొఫెషనల్స్ రాజకీయాల్లోకి రావడం దేశానికి మంచిదే కాని, ఇంత లేటుగా రావడం వల్ల ప్రయోజనం ఏమిటన్నదే ప్రశ్న. ఆయన ఈ నిర్ణయం కనీసం పది, పదిహేనేళ్ళ ముందే తీసుకుని ఉంటే బాగుండేది.
పద్మ విభూషణ్ డాక్టర్ ఎలట్టువలపిల్ శ్రీధరన్ 1932లో కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించారు. మన కాకినాడ ఇంజనీరింగ్ కాలేజి నుండి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ సంపాదించి ఇండియన్ రైల్వే సర్వీస్లో చేరారు. రామేశ్వరం వద్ద 1964 ఉప్పెనలో దెబ్బతిన్న పంబన్ వంతెనని 46 రోజుల్లో పునరుద్ధరుంచి అవార్డు అందుకున్నారు. రైల్వే శాఖ నుండి రిటైర్ అయిన తరువాత ప్రభుత్వం ఆయనకు కొంకణ్ రైల్వే నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. కొంకణ్ రైల్వే మన దేశంలో మొదటి BOT రైల్వే ప్రాజెక్ట్. చాలా క్లిష్టమయిన మార్గంలో నిర్మించబడ్డ ఈ ప్రాజెక్టుని విజయవంతంగా పూర్తి చేయడంతో శ్రీధరన్ పేరు దేశం అంతా తెలిసింది.
1997లో ప్రభుత్వం ఆయనను దిల్లీ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఆయన సారధ్యంలో దిల్లీ మెట్రో, తన మొదటి లైనుని 2002లో అప్పటి ప్రధాని వాజ్పేయి చేతుల మీదుగా ప్రారంభించింది. ఆ విజయం వెనుక శ్రీధరన్, ఆయన టీం కార్యదక్షతతో పాటు, అప్పటి ప్రధాని వాజ్పేయి, అప్పటి దిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఇచ్చిన స్వేఛ్చ, సహకారం కూడ ఉన్నాయి. పార్టీలకతీతంగా ఆ ఇద్దరు నాయకులు శ్రీధరన్ గారికి పూర్తిగా సహకరించారు. తనని స్వేఛ్చగా పని చేసుకోనిస్తేనే తనకి బాధ్యత ఇవ్వాలని, లేకుంటే అక్కరలేదని ఆయన గట్టిగా చెప్తారని అంటారు. దిల్లీ మెట్రో విజయం తరువాత దేశంలోని అనేక మహా నగరాలు మెట్రో ప్రాజెక్టులు ప్రారంభించాయి. ఆ విధంగా చూస్తే శ్రీధరన్ దేశంలోని మెట్రో ప్రాజెక్టులకి మార్గదర్శనం చేసినట్టు అనుకోవాలి. అందుకే ఆయనను మెట్రో మ్యాన్ అని గౌరవంగా సంభోదిస్తారు. 2011 లో దిల్లీ మెట్రొ నుండి రిటైర్ అయ్యాక, శ్రీధరన్ తన స్వరాష్ట్రమయిన కేరళలో కొచ్చి మెట్రోకి సలహాదారుగా పని చేసారు.
ముంబయి, అహ్మదాబాదుల మధ్య నిర్మించబోతున్న హై స్పీడ్ రైల్వేని (బులెట్ ట్రైన్) చాలా ఖరీదైన వ్యవహారంగా శ్రీధరన్ అభివర్ణించారు. అది సామాన్యులకి అందుబాటులో ఉండదని శ్రీధరన్ అభిప్రాయం. అలాంటి ఖరీదైన ప్రాజెక్టుల బదులు భారతీయ రైల్వేలని త్వరగా అధునీకరిస్తే మంచిదంటారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో హైదరాబాదు మెట్రోని ప్రైవేట్ కంపెనీ, మేటాస్కి ఇవ్వడాన్ని కూడ శ్రీధరన్ వ్యతిరేఖించారు. ఇది ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టడమే అని అప్పట్లో అన్నారు. ఇప్పుడు అదే శ్రీధరన్, ప్రైవేటైజేషన్ని యధేచ్చగా ప్రోత్సహిస్తున్న బిజెపిలో చేరడం యాధృచ్చికం!
అయితే కేరళలో బిజెపి బలం చాలా తక్కువ. ప్రస్తుత అసెంబ్లీలో ఆ పార్టీకి ఒకే ఒక సభ్యుడు ఉన్నాడు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం, వచ్చే ఎన్నికలలో కూడ బిజెపికి 5 సీట్లు మించి రాకపోవచ్చు. మరి శ్రీధరన్ తన స్థానం గెలుచుకున్నా పెద్దగా చెయ్యగలిగేదేమీ ఉండదు. ఒక పది, పదిహేనేళ్ళ ముందే ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఉంటే, బహుశా మంచి ఫలితం ఉండేదేమో? లేకపోతే ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం శ్రీధరన్ గారిని రాజ్యసభకి పంపిస్తుందేమో చూడాలి. ఏమైనా ఒక సివిల్ ఇంజనీరుగా శ్రీధరన్ గారికి నా శుభాకాంక్షలు అందచేస్తూ, మరింత మంది ప్రొఫెషనల్స్ రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నాను.
Metroman’ E Sreedharan has quit active politics, less than a year after he joined the Bharatiya Janata Party.
Sreedharan made the announcement on Thursday, December 16, in Malappuram, Kerala. He said that he had learnt a lesson from his loss in the Assembly elections held in April.
“I was never a politician,” he said as he announced his exit from active politics, adding, “Not being active in politics does not mean I am leaving politics behind.”
“When I lost I was disappointed. But it doesn’t matter. That time frame has passed now. I would have been an MLA if elected. I could have done nothing much by being an MLA alone,” he said.