‘బాలు’తా తీయగా చల్లగా…
నాకు ఒక చిన్న ఫాంటసీ ఉండేది. అదేమిటంటే ఎలాగోలా బాలుగారి appointment సంపాదించి, ఆయనతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక రోజంతా గడిపి, ఆయన సరదాగా పాడుకునే పాటలు, కూని రాగాలు వింటూ ఆనందించాలి. ఆ అవకాశం రావడం కష్టమని తెలుసు కాని, బాలు గారి అకాల మరణంతో ఆ అవకాశం ఇక ఎప్పటికీ రాదు. నాకు ఊహ తెలిసి బాలు పాటలు విన్నది, “అడవి రాముడు” సినిమాలో. అప్పట్లో “కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహా పురుషులవుతారు” పాట, గొప్ప inspirational song. ఆ తరువాత “శంకరాభరణం” పాటలు దేశమంతా మార్మోగాయి. ఇక 80లలో ఎప్పుడూ రేడియోలో మూడొంతులు బాలు పాటలే వినిపించేవి. బాలు పాటలు వింటూ పెరిగిన తరం నాది. అప్పుడు బాలు అంటే పాట, పాట అంటే బాలు. కొత్త శతాబ్దంలో కొత్త గాయకులు వచ్చే వరకు, సినీ సంగీత సామ్రాజ్యాన్ని బాలు ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు.
90లలో నేను గుజరాత్ లో పని చేస్తున్న సమయంలో ఒక మలయాళీ మిత్రుడు “శంకరాభరణం” పాటలు వింటుంటే, మీరు తెలుగు పాటలు వింటున్నారేమిటని అడిగాను. దానికి అతడు ఇవి తెలుగు పాటలు మాత్రమే కావు, భారతీయ సంగీతం అని చెప్పాడు. గత సంవత్సరం త్రివేండ్రం లో కాబ్ లో వెళుతున్నప్పుడు FMలో “శంకరాభరణం” పాటలు వింటుంటే సంగీతం అజరామరం అనిపించింది. ఆ అద్భుతమైన గానం చేసిన బాలు గారి గాత్రం కూడ అజరామరమే. బాలచందర్ భావగీతాలు, విశ్వనాథ్ శాస్త్రీయ సంగీతం, బాపు భక్తి గీతాలు, రాఘవేంద్రరావు మాస్ మసాలా పాటలు, ఇంకా విప్లవ సాహిత్యం ఇలా అన్ని రకాల పాటలు పాడగలడం కేవలం బాలు గారికి మాత్రమే సాధ్యమయింది. “ఓలమ్మీ తిక్క రేగిందా” నుంచి “ఓంకార నాదాను సంధానమౌ” వరకు, “అంతర్యామి” నుంచి “ఆ నలుగురు” వరకు, అల్లు రామలింగయ్య నుంచి అల్లు అర్జున్ వరకు అంతా ఆయన సంగీత ప్రపంచమే! మనల్ని నవ్వించి, ఏడిపించి, శాంతపరచి, ఉద్రేకపరచి, నవరసాలు తాను అనుభవించి పాడుతూ, మనకి కూడ ఆ అనుభూతులు కలిగేలా పరవశింప చేయడం బాలు గొప్పతనం.
అయితే అన్ని వేల పాటలు పాడడం వల్ల ఆయన గాత్రం రొటీన్ అయిపోయింది అని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా చక్రవర్తి లాంటి సంగీత దర్శకులకి బాలు పాడిన అసంఖ్యాకమైన మాస్ మసాలా పాటలు బాలు గారికి డబ్బులు తెచ్చిపెట్టాయేమో కాని, ఆయన స్థాయి పెంచలేదు. అయినా చిరంజీవి లాంటి అప్పటి యువ హీరోలకి పాడిన పాటలు శ్రోతలకి మంచి హుషారు, వినోదం ఇచ్చాయి. ఘంటసాల, జేసుదాసు, బాలమురళీకృష్ణ లాంటి కొంతమంది గాయకుల గొంతులో ఒక ప్రత్యేకమైన జీర ఉంటుంది. అది వాళ్ళ గాత్రానికి గొప్ప ఆకర్షణ. కొన్ని పాటలు వాళ్ళు పాడితేనే బాగుంటాయి. కాని బాలు గొంతు special plain voice. అందుకే మన స్నేహితుడు మన పక్కనే కూర్చుని పాడుతున్నట్టు ఉంటుంది. అదే గొంతుతో అవసరం అయినప్పుడు మిమిక్రీలా చేసి ఎన్నో అజరామరమైన పాటలు పాడి లెక్కలేనన్ని అవార్డులు అందుకున్నాడు.
“పాడుతా తీయగా” కార్యక్రమం అప్పట్లో ఒక అద్భుతం. ప్రతీ తెలుగింటి TVలో ఖచ్చితంగా చూసే ప్రోగ్రాం. ఇప్పుడు ఆనాటి వాసి తగ్గింది. ఎందరో యువ గాయనీ గాయకులకు భవిష్యత్తు ఇచ్చిన వేదిక. అందరికీ సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చు కాని, చాలా మంది ఫంక్షన్లలో పాడుతూ కూడ ఉపాధి పొందుతున్నారు. పాటల మధ్యలో బాలు గారు చెప్పే విశేషాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఆ విషయంలో ఆయన జ్ఞాపక శక్తి అద్భుతః. ఇప్పుడు వచ్చే టివి ప్రోగ్రాములలో చాలా మంది యాంకర్లు అందులో పాల్గొనే వాళ్ళమీద జోకులు వెయ్యడం, చిన్న చూపు చూడడం, ఒకోసారి హేళన చెయ్యడం మామూలు అయిపోయింది. కాని బాలు గారు మాత్రం చిన్న పిల్లలకి కూడ గౌరవం ఇచ్చి మాట్లాడతారు. అప్పుడప్పుడు కొంతమందిని ఆట పట్టించినా, అది బాలుడి చిలిపితనమే కాని, అహంకారం కాదు. అది కూడా పరిధి దాటి ఉండదు. హిందీలో అమితాబ్ బచ్చన్ కూడ ఇలాగే హుందాగా కార్యక్రమం నిర్వహిస్తారు.
బాలు గాయకుడే కాకుండా సంగీత దర్శకుడు కూడ. ఎక్కువ సినిమాలు చెయ్యకపోయినా, “మయూరి”, “పడమటి సంధ్యారాగం” లాంటి కొన్ని మంచి సినిమాలకి చేసారు. అలాగే ఆయన చాలా సినిమాలలో నటించినా, “మిథునం” మాత్రం ఒక అద్భుతం. ఆ సినిమాపై నా టపా ఇక్కడ. నిజానికి శ్రీరమణ గారి కథ ప్రకారం, బాలు గారి ఆకారం, వాచకం ఆ పాత్రకి సరిపోవు. కాని సినిమా చూస్తే ఆ పాత్రని బాలు బాగా ఇష్టపడి చేసారని మనకి అనిపిస్తుంది. బాలు గారిలోని మరో మంచి గుణం, పాజిటివ్ దృక్పథం. ఆయన ఎంతో ఆశాజీవి. నెగెటివ్ గా ఎప్పుడూ మాట్లాడరు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడం, దానిని సగౌరవంగా ప్రకటించుకోవడం, ఇంత సాధించిన తరువాత కూడ నా గురించి నేను చెప్పుకోకపోవడం న్యాయం కాదు అని అనగలగడం, ఆయన ఆత్మ విశ్వాసానికి చిహ్నం. ఇక బాలుడి బ్యాటింగ్ ముగిసింది. కరోనాతో హర్ట్ అయి, అకస్మాత్తుగా ప్రపంచం నుండి రిటైర్ అయ్యాడు. కాని ఆయన పాటలు మన మనసుల్లో ఎప్పటికీ పరుగులు పెడుతూనే ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలని 25 జిల్లాలకు పెంచబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనకి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిని ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి పరిధి వలన ప్రజల సామాజిక అవసరాలు తీరడంలో ఇబ్బందులు వస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గాలకి, స్థానిక పరిపాలనకి పెద్దగా సంబంధం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో తమకుండే పనులకి ప్రజలు తరచుగా జిల్లా ముఖ్యపట్టణం వెళ్ళవలసి ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల ముఖ్య పట్టణాలు జిల్లాకి మధ్యలో లేవు. స్థానిక పరిపాలన అంతా రెవెన్యూ డివిజన్లు, మండలాలు ప్రాతిపదికన నడుస్తోంది కాబట్టి, కొత్త జిల్లాలు కూడ వీటి ప్రాతిపదికనే ఏర్పాటు చెయ్యడం ప్రభుత్వానికి, ప్రజలకీ సౌకర్యంగా ఉంటుంది. భవిష్యత్తులో నియోజకవర్గాల పరిధి మారవచ్చు, కొన్ని నియోజకవర్గాలు ఉండకపోవచ్చు. అంతే కాకుండా ఒకో జిల్లాకి, ఒకో MP సామంత రాజుగా వ్యవహరించే ప్రమాదం కూడ ఉంది.
రాష్ట్రంలో 50 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కాబట్టి జనాభా, వైశాల్యం లాంటి వివరాల ఆధారంగా, రెండు లేదా మూడు డివిజన్లతో ఒకో జిల్లా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. విశాఖపట్నం, విజయవాడ లాంటి ముఖ్య నగరాలని ఒకో డివిజనుతో ఏర్పాటు చెయ్యవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి అవడానికి, భూ సేకరణకి, తరువాత నిర్వహణకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చెయ్యాలి. అలాగే ప్రకృతి అందాల కోనసీమని పర్యాటకంగా అభివృద్ధి చెయ్యడానికి అమలాపురం డివిజనుని కోనసీమ జిల్లా చెయ్యాలి. నాకు ఉన్న విషయ వనరులు, ఆలోచనలని బట్టి ఈ క్రింది విధంగా జిల్లాలు పునర్విభజించవచ్చని అనుకుంటున్నాను. ప్రభుత్వం తన అవసరాలకి అనుగుణంగా కావలసిన మార్పులు, చేర్పులు ఎలాగూ చేసుకోవచ్చు.
ఆర్థర్ కాటన్ – డొక్కా సీతమ్మ
కాటన్ దొర అని గోదావరి జిల్లాల ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ (మే 15, 1803 – జూలై 24, 1899) బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. 1847 – 52 సంవత్సరాలలో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను నిర్మించారు. అప్పటి వరకు క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది.
గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ (1841 – 1909). తూర్పు గోదావరి జిల్లా గన్నవరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన అక్విడెక్టుకు ఈమె పేరున డొక్కా సీతమ్మ అక్విడెక్టు అని నామకరణం చేసారు.
గోదావరి జిల్లాల ప్రజలు ఈ ఇద్దరు మహానుభావులని ఎంతో అభిమానిస్తారు, గౌరవిస్తారు. చిత్రంగా వీరిద్దరూ ఇంచుమించు సమకాలీకులు. వీళ్ళు ఒకరినొకరు కలిసారో లేదో మనకు తెలియదు కాని, గోదావరి ప్రజలు వీళ్ళిద్దరికీ ఎప్పటికీ ఋణపడి ఉంటారు. వీళ్ళిద్దరి గురించి ఒక చోట వ్రాయడానికి కారణం ఏమిటంటే, నాకు ఇద్దరిలోను కొన్ని పోలికలు కనిపించాయి. ఇద్దరూ, తమ తమ పరిధిలో వీలైనంత మానవ సేవ చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఒకరు ప్రభుత్వ ఉద్యోగి అయితే, ఒకరు గృహిణి. కాటన్ మిగతా ఉద్యోగుల మాదిరి పై అధికారి చెప్పిన పని మాత్రమే చేసి, జీతం తీసుకుని భార్యాబిడ్డలతో దర్జాగా జీవించవచ్చు. సీతమ్మ గారు కూడ ఒక సాధారణ మహిళలా నగలు, చీరలు కొనుక్కుని ఆనందంగా జీవించవచ్చు. కాని వాళ్ళిద్దరు కూడ అలా ఆలోచించలేదు. అందుకే మనం వాళ్ళని ఇప్పటికీ తలుచుకుంటున్నాము.
కాటన్ మన దేశీయుడు కాదు, ఉద్యోగరీత్యా మన దేశానికి వచ్చాడు. దేశభక్తి కంటే మానవ సేవే గొప్పదని భావించాడు. ఇక్కడ ఉన్న నీటి వనరులని సద్వియోగం చేస్తే, ప్రజల ఆకలి బాధలు తీరడమే కాకుండా ప్రభుత్వానికి కూడ ఆదాయం పెరుగుతుందని పై అధికారులని ఒప్పించి గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించాడు. ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ లేదు, సౌకర్యాలు లేవు. అయినా నిర్మాణంలో ఎన్నో కష్టాలకి ఓర్చి, తను అనుకున్నది సాధించాడు. అపర భగీరథుడు అనిపించుకుని, కొన్ని కోట్లమందికి చిరస్మరణీయుడు ఆయ్యాడు. ఎన్నో భవిష్యత్ తరాలకు అన్నదాత అయ్యాడు. సీతమ్మ గారి వివాహం జరిగిన కొన్నేళ్ళకే, గోదావరి మీద ఆనకట్ట నిర్మాణం పూర్తి అయ్యింది కాబట్టి, బహుశా కాటన్ గారు కట్టిన ఆనకట్ట వలన జోగన్న గారి పొలాలు బాగా పండి సీతమ్మ గారు అంతగా అన్నదానం చెయ్యగలిగారేమో మనకు తెలియదు.
సీతమ్మ గారికి బాల్యంలోనే డొక్కా జోగన్న గారితో వివాహం జరిగింది. భర్త సహకారంతో ఇంటికి వచ్చిన వారందరికీ లేదనకుండా అన్నం పెట్టి పంపించేది ఆమె. రవాణా సౌకర్యాలు, భోజన సౌకర్యాలు అంతగా లేని ఆ రోజుల్లో, ఆకలితో అలమటించే ప్రయాణికులకి ఒక్క పైసా తీసుకోకుండా అన్నదానం చేసి అన్నపూర్ణ అనిపించుకుంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకి అన్నం పెట్టి, ఆర్థిక సాయం చేసి ఆదుకునేది ఆ మహాతల్లి.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఒక ప్రభుత్వాధికారిగా ప్రజలకు మంచి జరగడానికి, వాళ్ళ అభివృద్ధికి ఏది అవసరమో ఆ పని కాటన్ గారు చేసారు. ప్రభుత్వం ఒక ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ ప్రాంతం భవిష్యత్తు మారిపోతుంది. అదే ప్రభుత్వం చెయ్యవలసిన పని. అంతే కాని ఆ డబ్బుని ప్రజలకి పంచిపెడితే కొన్ని నెలలలోనే ఖర్చయిపోతుంది. ప్రజలకి బతకడం నేర్పాలి, బతకడానికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి. అంతే కాని, కూర్చోబెట్టి అన్నీ సమకూరుస్తూ ఉంటే, వాళ్ళు సొంతంగా బతకడం మర్చిపోతారు. అయితే సంపాదించలేని స్థితిలో, వయసులో ఉన్నవాళ్ళకి సహాయం చెయ్యడం న్యాయమే.
డొక్కా సీతమ్మ గారు చేసింది అన్నదానం. అది కూడ బాటసారులకి, కష్టాల్లో ఉన్నవాళ్ళకి. ఆమె చేసింది తాత్కాలిక సాయమే, కాని ఆమె చాలామందికి చేసింది. సరిగ్గా ఇదే వ్యక్తులు, స్వచ్చంద సంస్థలు చెయ్యవలసిన పని. ఇదే పని ప్రభుత్వం చేస్తే దళారులు ఎన్ని దారుణాలు చేస్తారో మనకు తెలుసు. అలాగే ఎంత ధనవంతులైనా, వ్యక్తులు ప్రాజెక్టులు కట్టలేరు, ప్రభుత్వమే కట్టాలి. కాని సామాన్యులు కూడ తమకు వీలైనంతలో, ఇబ్బందుల్లో ఉన్న సాటివారికి సహాయం చెయ్యగలరు. ఈ మధ్య వలస కార్మికులకి ఎంతోమంది పౌరులు, సేవా సంస్థలు సహాయం చెయ్యడం మనం చూసాము.
కాబట్టి కాటన్ గారి, సీతమ్మ గారి జీవితాల నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, ప్రభుత్వం చెయ్యవలసిన పని ప్రభుత్వం చెయ్యాలి, ప్రజలు చెయ్యవలసిన పని ప్రజలు చెయ్యాలి. అప్పుడే ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటుంది. ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడి సంపన్నులవుతారు. దేశం అభివృద్ధి సాధిస్తుంది.